కొన్ని యుగాల క్రితం రామ నామానికే పరవశించే ఒక మారుతి ని “ఏమోయ్ ఎప్పుడూ రాముడు రాముడూ అంటావు!! ఆయన ఎక్కడ? నీలో ఉన్నాడా?” అని అడిగితే, తన గుండెను చీల్చి, లోపల కొలువై ఉన్న రామలక్ష్మణుల ని చూపించాడట.
నూట ఇరవై అయిదేళ్ళ క్రితం ఒక వర్గాన్ని కొంత మంది పెద్ద మనుష్యులు “మీకు రాముని గుడిలో ప్రవేశం లేదు. రామనామాన్ని సైతం ఉచ్చరించ కూడదు” అని కట్టడి చేశారు.
ఆ వర్గం ఎటువంటి వివాదాలకి దిగకుండా ‘రామ’ నామాన్ని పచ్చబొట్టుగా శరీరం లో అంగుళమయినా విడవకుండా, ఆఖరికి అరచేతి లో సహా పచ్చబొట్టు తో రామనామాలంకరణ చేసుకున్నారు.
పెద్ద మనుష్యుల కాపీ రైట్ కి గండి పడింది. ఆ వర్గాన్ని స్వయానా వాళ్ళే ‘రామనామీలు’ గా సంబోధించడం మొదలయ్యింది.
త్రేతాయుగం లో ‘రామభక్త హనుమాన్’. కలియుగం లో ‘రామనామీ’లు
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం లోని బిలాస్ పూర్, రాజ్ ఘడ్, రాయపూర్ జిల్లాలలో మహానది ఒడ్డున ఉన్న గ్రామాల్లో నివసించే ‘రామనామి’ ల జనాభా సుమారు అయిదు లక్షలు. ప్రభుత్వ లెక్కల ప్రకారం షెడ్యూల్ కులాల వర్గీకరణ లో ఉన్నారు.
**
ఇదంతా రాయగడ్ జిల్లా లోని చప్రా గ్రామానికి చెందిన పరుశురామ్ అనే వ్యక్తి కారణంగా మొదలయ్యింది. 1894 ప్రాంతం లో అతనికి రాముడే స్వయంగా కనిపించి మీ శరీరం రామమయం చేసుకుని త్రికరణశుద్దిగా రామనామాన్ని జపించమని మార్గదర్శనం చేశాడట. అప్పటి నుండి పరుశురామ్ రామనామీ అయ్యాడు.
ఊరూరా తిరిగి రామనామాన్ని ప్రచారం చేయ సాగాడు. గుండెల్లోంచి వెల్లువ లా పెల్లుబికిన రామభక్తి ఆ నిర్భయులని ఒకటిగా చేసి, రామనామ సంపదతో ముంచేసింది. రామనామం ఒక మహా ఉద్యమం అయిపోయింది.
కాపీ రైట్ తమదే అని భావించే పెద్దలకి ఇది మింగుడు పడలేదు. వారి మూఢభక్తి అర్ధం కాలేదు.
బ్రిటిష్ అధికార్లకి అర్జీలు పెట్టుకున్నారు. రాయపూర్ హై కోర్ట్ కి మొరపెట్టుకున్నారు. ఏళ్ల తరబడి వాదనలు నడిచాయి.
1911 లో రాముడే గెలిచాడు. రామనామాన్ని ఉచ్చరించడమే కాదు, పచ్చ బొట్టు గా పొడిపించుకునే హక్కు అధికారం అందరికీ ఉన్నాయని కావాలంటే నాలుకపై కూడా రామనామం ముద్రించుకోమని కోర్టు తీర్పు చెప్పింది.
అప్పటి నుండి రామనామీలు తమ శరీరాన్నే రామకోటి పుస్తకంగా మార్చేసుకున్నారు. నడిచే రామకోటి అవటం కోసం వాళ్ళంతా సూదులతో పొడిపించు కునే వారు. ఇది మొత్తం 18 రోజుల పాటు నియమ నిష్టలతో జరిగే కార్యక్రమం.



ఈ రామనామీలు తోటి రామనామీలని పరమ భక్తులుగా భావించి ఆతిద్యం ఇస్తారు. ఊరు పేరు అవసరం లేదు. పచ్చబొట్లే బంధుత్వం, ‘ రాం..రాం ‘ లే పలకరింపులు. రామనామీల ఒంటి పై ఉండే శాలువా కూడా రామనామాల తో అలంకరింపబడి ఉంటుంది. వాటి మీద రామనామాల అద్దకం కూడా 18 రోజుల పాటు సాగుతుంది భక్తి గా సాగుతుంది.
రామనామీల దేవాలయాలు కూడా ప్రత్యేకమయినవి. వాటిలో విగ్రహాలు ఏమి ఉండవు. కేవలం రామ నామమే ఉంటుంది.
రామనామీలు చిన్న బుద్దుల పెద్దవారికి చెంప దెబ్బ లాటి వారు. దేవుడు అందరి సొత్తు అని చెప్పే పరమ భాగవతోత్తములు.
గుడిలోకి రావద్దన్న సాకును చూపి మతం మార్చే వారి డొల్లతనాన్ని ఈ వర్గం సవాలు చేస్తుంది.
వారందరికి ఈ ఉదయం మనం “జై శ్రీరాం” లతో అభినందనలు తెలుపుదాం .
జై శ్రీరాం _/][\_